తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతోంది. 12 డైరెక్టర్ పదవులకు గానూ 45 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేయడం, పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ నేతలు వైసీపీని విమర్శిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఆ పార్టీ నాయకులు సంజయ్, రవి నాయుడు, ఆర్సీ మునికృష్ణలతో సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అర్బన్ బ్యాంకు ఎన్నికల ప్రక్రియపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని విమర్శలు గుప్పించారు నారా లోకేష్. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరో సారి బయటపడిందన్నారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయ్యడానికి వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుంటే వదలివేసి టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి నిదర్శనమని మండిపడ్డారు లోకేష్. అరెస్టు చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా వైసీపీ అదే అరాచకం, అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి టౌన్ బ్యాంకు ఎన్నికల్లో నిజాయితీగా గెలిచే దమ్ములేక వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని మండిపడ్డారు. టీడీపీ నేతలను గృహ నిర్భందం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నికలెందుకని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. వైసీపీ నేతలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దొంగ ఐడి కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అధికార బలంతో ఈ ఎన్నికల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు అన్నారు.
కాగా టీడీపీ ఆరోపణలను తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసే వ్యక్తుల్ని వారే తీసుకువచ్చి ఇక్కడ ఏదో జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తుంటే కావాలనే డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు అంటూ నాటకాలకు తెరలేపారని భూమన విమర్శించారు.