అమరావతి, ఫిబ్రవరి 25: జాతీయ ఉపాధి హామీ పనుల (నగేరా) లక్ష్యం పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునిఠ అన్నారు. సోమవారం నీరు ప్రగతిపై జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగేరా కింద ఇప్పటి వరకూ 8200కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు.
ఆయుష్మాన్ భారత్లో మన రాష్ట్రం దేశంలోనే ముందుందని సీఎస్ పునిఠ తెలిపారు. జల వనరులశాఖకు ఏడు అవార్డులు వచ్చాయనీ, ఇంధన పొదుపులో నెంబర్ వన్గా ఉన్నామని పునిఠ తెలియజేశారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలనీ, చెరువులను నింపాలని ఆయన ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలను నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాల్లో ఎక్కడా పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని పునిఠ తెలిపారు,
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలనీ, గ్రామీణ నీటి సరఫరా, చాయితీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయం పనిచేయాలని సూచించారు.
అన్నదాత సుఖీభవ కింద 42లక్షల మంది రైతుల ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ అయ్యాయనీ, మిగిలిన ఖాతాల్లో కూడా వెంటనే జమ చేయాలని ఆదేశించారు.
‘అన్నదాత సుఖీభవ’ కౌలు రైతులకు కూడా అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని తెలియజేస్తూ..రైతులు అందరికీ ‘సుఖీభవ’ ప్రయోజనం అందించాలని అధికారులకు పునిఠ సూచించారు.