పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. మూర్చ, తల తిరగటం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. బాధితుల సంఖ్య 443 కు చేరుకుంది. దాదాపు మందికిపైగా చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఒకరు మృతి చెందారు. ఆందోళనకరంగా ఉన్న 16 మంది పేషెంట్లను విజయవాడ ఇతర ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? అనే విషయాలను వైద్యులు చెప్పలేక పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఏలూరులో అసలు ఏమి జరుగుతోంది, ఈ అంతుచిక్కని వ్యాధి ఏమిటి అనేది తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వైద్య బృందాన్ని అత్యవసరంగా పంపుతున్నది. ఈ బృందం మంగళవారం ఏలూరు లో పర్యటించి ప్రజల ఆకస్మిక అనారోగ్యం పై విచారణ చేయనున్నది. న్యూఢిల్లీ ఎయిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ (ఎమర్జెన్సీ మెడిసిన్) డాక్టర్ జంషెడ్ నాయర్, పూణే ఎన్ఐవి వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ డియోష్టవర్, ఎన్సిడిసి పిహెచ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సంకేట్ కులకర్ణి లు బృందంగా క్షేత్ర స్థాయిలో పరిశోధన జరిపి మంగళవారం సాయంత్రం లోగా నివేదిక అందజేయాలని ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (పీహెచ్ డివిజన్) ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఉదయం ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. అధికారులతో సమీక్ష జరిపారు.