వాళ్లంతా యూనివర్సిటీ విద్యార్థులు. ఎంతో క్రమశిక్షణతో ఉండి.. ఎదుటివాళ్లకు మంచి చెప్పాల్సిన విద్యార్థులే అడ్డదారులు తొక్కారు. కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని భారీ సంపాదనకు తెరలేపారు. ఈ విషయం తెలిసిన యూనివర్సిటీ అధికారులు వెంటనే ఆ విద్యార్థులపై విచారణకు ఆదేశించారు.
యూఎస్ లోని ఇదహో అనే ప్రాంతంలో ఉన్న బ్రిఘం యంగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కరోనా వైరస్ ను అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించాలని అనుకున్నారు. దీంతో కరోనా వైరస్ ను అంటించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత వెంటనే కోలుకొని.. తర్వాత తమ ప్లాస్మాను అమ్ముకుంటున్నారు.
చాలామంది విద్యార్థులు కరోనా అంటించుకోవడం.. కరోనా తగ్గించుకోవడం.. వెంటనే ఆసుపత్రులను ప్లాస్మాను అమ్ముకోవడం.. ఇదే తంతు. ఈ విషయం చివరకు యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో.. వెంటనే ఆ విద్యార్థులపై విచారణకు ఆదేశించారు. ప్రాణాలను పణంగా పెట్టి కేవలం డబ్బు కోసం ఇంతటి ఘోరానికి పాల్పడిన విద్యార్థులపై చర్యలు కూడా తీసుకోవడానికి యూనివర్సిటీ సిద్ధమయింది.
ఇక నుంచి యూనివర్సిటీలోని ఏ విద్యార్థి కరోనాను అంటించుకొని.. ప్లాస్మాను అమ్ముకోవద్దని అధికారులు విద్యార్థులను హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే.. వాళ్లను వెంటనే యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీకి చెందిన 119 మంది విద్యార్థులతో పాటుగా 20 మంది స్టాఫ్ కు కరోనా వైరస్ సోకిందట. అక్కడ ప్లాస్మాకు బాగా డిమాండ్ ఉందట. కరోనా నుంచి కోలుకున్న వాళ్ల నుంచి సేకరించే ప్లాస్మాకు సుమారు 100 నుంచి 200 డాలర్లను ఆసుపత్రులు చెల్లిస్తున్నాయట. అందుకే.. ఆ యూనివర్సిటీ విద్యార్థులు ప్రాణాలకు తెగించి మరీ.. పాకెట్ మనీ కోసం ఈ పని చేస్తున్నారన్నమాట.