దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయం సాధించడం లాంఛనప్రాయంగానే కనిపిస్తొంది. ఎన్డీఏ కూటమితో పాటు వైసీపీ, బీజేడి (బీజూ జనతా దళ్) సహా శివసేన,శిరోమణి అకాళీదళ్, జేడీఎస్ తదితర పార్టీలు మద్దతును ఇస్తున్నాయి. ఇతర పార్టీల మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఎన్డీఏ కూటమికి వైసీపీ, బీజేడీ పార్టీలు మద్దతు ఇస్తేనే 55.83 శాతం ఓట్లు వస్తాయి. భారతదేశ చరిత్రలో మొదటి సారిగా రాష్ట్రపతిగా గిరిజన మహిళకు అవకాశం లభిస్తుండటంతో తటస్థ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయంగా కనిపిస్తొంది. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డుకెక్కనున్నారు.
కాగా ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. పార్లమెంట్ తో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్లమెంట్ లో ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఈ సారి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ లో, 44 మంది ఎంపీలు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఓటు వేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. టీఎంసీకి చెందిన 21 మంది లోక్ సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు కోల్ కతాలోని శాసనసభలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపి నుండి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ గుజరాత్ అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీలో 10.81 లక్షల ఓట్లు ఉండగా, వివిధ పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో 6.66 లక్షల ఓట్లు దక్కే అవకాశం ఉందని అంచనా. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాన్ని వెల్లడిస్తారు. 25వ తేదీ నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.