తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు పాలకవర్గ సమావేశం జరుగనున్నది. టీటీడీ ఆస్తుల వేలానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న పాలకవర్గ సమావేశంలో తీసుకోబోయే కీలక అంశాలపై ఉత్కంఠత కొనసాగుతున్నది. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 93 అంశాలతో కూడిన భారీ అజెండాపై బోర్డు చర్చించనుంది.
లాక్ డౌన్ కారణంగా దర్శనాలు ఆగిపోయిన తరువాత, ఆర్థిక లోటు ఏర్పడగా, ఆర్ధిక అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని సమాచారం. లాక్ డౌన్ తరువాత భక్తులకు దర్శన విధానం, నిరర్ధక ఆస్తుల అమ్మకంపై విధానపరమైన నిర్ణయం, కొత్త సిబ్బంది నియామకం, వివిధ రాష్ట్రాల్లోని అనుబంధ దేవాలయాలకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై పాలకవర్గం చర్చించి కీలక నిర్ణయాలను తీసుకోనుంది. సమావేశంలో కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింగాల్ అదనపు ఈవో ధర్మారెడ్డి, సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పొల్గొననున్నారు.