అమరావతి, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను టోల్ ప్లాజా నిర్వహకులు పాటించడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది వారి స్వగ్రామాలకు వెళుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా మారింది. టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు కోసం వాహనాలను నిలుపుదల చేయవద్దని, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావుల ఆదేశాల మేరకు ఈ నెల 13,16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్ వసూలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ఉత్తర్వులను టోల్ ప్లాజా నిర్వహకులు పాటించడం లేదు. టోల్ రుసుము విషయంపై వాహనదారులకు, టోల్ గేటు సిబ్బందికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గంటల తరబడి వాహనాల నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వ ఉత్తర్వులు అందలేదని, జాతీయ రహదారుల సంస్థ నుండి సమాచారం లేదని టోల్ ప్లాజా నిర్వాహకులు తెలుపుతున్నారు. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుండి టోల్ రసుము వసూలు చేస్తున్నారు.