ఏపీ రాజధాని రాజకీయం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో.. సినీ ఇండస్ట్రీనే రాజధాని విషయంలోకి ఎంటరైందో కానీ ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అమరావతి టు గన్నవరం, హైదరాబాద్ వయా సీఎం జగన్ టు సినీ ఇండస్ట్రీ వయా అశ్వనీదత్, కృష్ణంరాజు వరకూ.. ఇలా రాజధాని రాజకీయం సినీ పెద్దల చుట్టూ తిరుగుతోంది. రాజధానిని తరలిస్తే తమ భూముల పరిస్థితి ఏంటంటూ వీరు, కొంతమంది రైతులు హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో రాజధాని తరలింపులో పెద్ద మలుపులా కనిపిస్తోంది.
అప్పట్లో ఏం జరిగిందంటే..
టీడీపీ అధికారంలో ఉన్న 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఆ సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చేయాలనుకున్నారు. ఇందుకోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 800 ఎకరాలు సేకరించారు. ఈ రైతులకు ప్రత్యామ్నాయంగా అమరావతిలో సీఆర్డీఏ పరిధిలో ఎకరానికి 25 సెంట్ల భూమి ఇస్తామని ఒప్పందం చేసుకుంది అప్పటి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో గన్నవరం ప్రాంతంలో ఎకరం 5కోట్లు ధర ఉండగా.. అమరావతి ప్రాంతంలో 25 సెంట్లు అంతకుమించి ధర ఉండేది. దీంతో రైతులు ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారు. ఈక్రమంలో అశ్వనీదత్ 40 ఎకరాలు, కృష్ణంరాజు 31 ఎకరాలు.. గన్నవరం విమానాశ్రయం కోసం అప్పటి ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ కథ మలుపులు తిరిగింది.
హైకోర్టులో పిటిషన్ తో మళ్లీ కథ మొదలు..
అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రక్రియలో జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసింది. దీంతో గన్నవరం ప్రాంతంలో వీరు ఇచ్చిన భూముల విలువ తగ్గిపోయింది. దీంతో అశ్వనీదత్, కృష్ణంరాజు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరంలో తాము ఇచ్చిన విలువ గల భూమినే ఇవ్వాలని.. లేదంటే అందుకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు అశ్వనీదత్ 40 ఎకరాలకు 210 కోట్లు, కృష్ణంరాజు 31 ఎకరాలకు 180 కోట్లు డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా రాజధాని రాజకీయంలో సినీ పెద్దలు ఎంటరయ్యే వరకూ వెళ్లింది. వీరి వెనుక ఎవరున్నారు అనేది పక్కనపెడితే వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కాస్త చిక్కుముడిగానే ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?