మొత్తానికి ఈ రోజు సుప్రీం కోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ఒకవైపు కరోనా కేసులు నమోదు అవుతుంటే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంటే ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ఏవి ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వ్యాక్సినేషన్ తో పాటు ఎన్నికల నిర్వహణ కూడా ముఖ్యమని…. అది దేశ రాజ్యాంగ వ్యవస్థ లో ఒక కీలకమైన భాగం అని తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పట్టుబట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై పలు విమర్శలు వచ్చాయి. ఇదే వరుసలో ఎన్నికల సంఘం వ్యవహారం పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని సుమన్ వ్యాఖ్యానించారు. అసలు గత ఏడాది ప్రభుత్వం తో సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని…. అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈ గొడవ ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సుమన్ అలాగే ఏపీలో విగ్రహాల ధ్వంసంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలు, విగ్రహాలపై దాడి జరిగిన ఘటనలు నిజంగా విచారకరం అని పేర్కొన్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ ను విమర్శించడం అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం నిజంగా దారుణమని సుమన్ అన్నాడు. అంతేకాకుండా మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని… అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నారు అని చెప్పడం గమనార్హం.
ఇక జగన్ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అంటే చిన్న విషయం కాదని…. ఇది ఎంతో శుభపరిణామమని సుమన్ ప్రశంసించాడు. అంతేకాకుండా చివర్లో జగన్ హయాంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సుమన్ కితాబు ఇచ్చాడు.