(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలుగు చిత్ర సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లిన చిరంజీవి, నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల భీభత్సానికి హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో వరద బాధితులను ఆదుకునేందుకు పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, సంస్థలు తమ వంతు సహకారం అందించాలని సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు. కేసిఆర్ పిలుపుతో సినీ సెలబ్రిటీలు చిరు, నాగ్ తో పాటు ఇతర హీరోలు, ఇండస్ట్రీ ప్రముఖులు లక్షలు, కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున శనివారం సీఎం కేసిఆర్ ను కలిసి వారు ప్రకటించిన విరాళాల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ కు విచ్చేసిన ఈ అగ్ర హీరోలను కేసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసిఆర్ వారిని అభినందించినట్లు సమాచారం. ఇంతకు ముందు లాక్ డౌన్ సమయంలోనూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను చిరు, నాగ్ లు కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై కలిశారు. షూటింగ్ ల పునరుద్ధరణ, ధియేటర్ ల ఓపినింగ్ తదితర విషయాలపై తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తరువాత సీఎం కేసిఆర్తో వీరు భేటీ అయ్యారు. నేడు మరో సారి కేసిఆర్ ను కలిసి వీరు ఇండస్ట్రీ తరపు నుండి ఎలాంటి సాయం కావాలన్నా అందించడానికి సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.