Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో హీరోలదే డామినేషన్. టాలీవుడ్ కు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా దాదాపు కథానాయకుడు ప్రధానంగా ఉండే కథలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. అయితే అటువంటి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల దగ్గర విశేష ప్రజాదరణ పొందిన హీరోయిన్లు చాలా తక్కువ మంది. వారిలో తెలుగువారు ఎక్కువగా ఆదరించిన వారిలో సావిత్రి, సౌందర్య పేర్లు ముందు ఉంటాయి.
ప్రొడ్యూసర్లు కూడా వారిని నమ్ముకొని బడ్జెట్ పెట్టడం… వారి మార్కెట్ పై భరోసాతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం చాలా సార్లు చూశాను. అయితే సౌందర్య తర్వాత అంతటి రేంజ్ ఉన్న హీరోయిన్ కనిపించలేదు. కేవలం నటన, అందం, మార్కెట్ కాకుండా వ్యక్తిత్వం విషయంలో కూడా సావిత్రి, సౌందర్య ఎవరికి వారు గొప్ప. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలలో వారిద్దరి రేంజ్ లో ఈ హీరోయిన్ కు ఇస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియా లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందిన సాయిపల్లవి ఇప్పుడు టాలీవుడ్ లో అంతటి గౌరవానికి దగ్గరగా చేరింది అనే చెప్పాలి. తాజాగా ఆమె నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా లో ఏ పోస్టర్ వదిలినా కూడా రానాకు మించి సాయి పల్లవి హైలెట్ అవుతోంది. మొదటిగా ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మొదటి ప్రోమో కూడా ఆమెపేరు మీద వస్తుండడంతో ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశంగా మారింది.
‘విరాటపర్వం’ కి చెందిన ఏ పోస్టర్ లో కూడా ముందు సాయిపల్లవి పేరు ఆ తర్వాత రానా పేరు వేస్తున్నారు. బాహుబలి సినిమా ద్వారా దేశం మొత్తం గుర్తింపు పొందిన రానా లాంటి హీరో తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం కూడా విశేషమే. పైగా ఈ సినిమాని నిర్మిస్తుంది రానా తండ్రి సురేష్ బాబు. నటిగా సాయి పల్లవి ఏంటో అందరికీ తెలుసు. అయితే వ్యక్తిత్వంలో కూడా ఆమెకు ఎవరికీ తీసిపోరు.
తనకు ఎంత డబ్బులు ఇచ్చినా స్కిన్ షో కు ఒప్పుకోదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటుంది. ఏదో ఊరికే వచ్చి పోయే హీరోయిన్ గా తను సినిమాలు చేయనని తెగేసి చెప్పింది. అంతేకాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ కు అంబాసిడర్ గా చేయమని కోట్ల రూపాయలు వస్తే సున్నితంగా తిరస్కరించింది. ఇక సాయి పల్లవి, సావిత్రి, సౌందర్యాల పక్కన నిలిచేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.