హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఫణిగా పేరు పెట్టారు.
శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలో మీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపారు. మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 30 వ తేదీ నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరోవైపు తుపాను గమనాన్ని ఆంధ్రప్రదేశ్లోని రియట్టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్),భారత దేశ వాతావరణ విభాగం(ఐఎండి) నిశితంగా గమనిస్తున్నాయి. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు కూడా తీరప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.