tirupati by poll : తిరుపతి ఉప ఎన్నిక Tirupati by poll తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. పార్టీలన్నీ తమ బలాబలాలు చూపించాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు చేశాయి. హామీలు ఇచ్చాయి. ప్రభుత్వ వైఫల్యాలను చూపించి ప్రధాన ప్రతిపక్షం, ఇతర పార్టీలు ప్రజల్లోకి వెళ్లాయి. తాము చేస్తున్న సంక్షేమం, గత ప్రభుత్వ తప్పిదాలు.. పార్టీల తీరును అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రచారం ముగిసింది.
రేపు ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ ను నిలబెట్టుకోవాలని వైసీపీ.. గెలిచి సత్తా చాటాలని టీడీపీ, ఉనికి చాటుకోవాలని బీజేపీ-జనసేన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. ఉప పోరు రసవత్తరంగా మారిపోయింది. కారణం.. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే.
సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరచిన అభ్యర్ధులు ఎక్కువగా గెలుపొంది పంచాయతీలపై పట్టు సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావించిన టీడీపీ కొన్ని పంచాయతీలను గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని భావించింది. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.
పంచాయతీల్లో తాము బలపరచిన అభ్యర్ధులను గెలిపించి సత్తా చాటుకుంది జనసేన. మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మినహా వైసీపీ ఎవరికీ అవకాశమే ఇవ్వలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో ఇప్పట్లో వైసీపీకి ఎదురుతిరిగే ధైర్యం విపక్షాల్లో లేకపోయింది. అయితే.. వీరికి అందివచ్చిన అవకాశంలా తిరుపతి ఉప ఎన్నిక వచ్చింది.
ఉప ఎన్నికలో గెలుపు నల్లేరుపై నడకే అని భావించిన వైసీపీకి పరిస్థితులు జటిలంగా మార్చేశాయి. పవన్ రోడ్ షో.. సంచలనం రేపాయి. టీడీపీ కూడా ప్రచారంతో హోరెత్తించింది. చంద్రబాబు, లోకేశ్ తమదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. దీంతో వైసీపీ అలెర్టయింది. స్వయంగా సీఎం వైఎస్ జగన్ తిరుపతి ప్రచారానికి వస్తానని ప్రకటించినా.. మళ్లీ రద్దు చేసుకున్నారు.
ఇప్పుడు అక్కడ దాదాపు సగం ప్రభుత్వమే అక్కడ ఉండి వైసీపీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇలా మొత్తంగా తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా మారిపోయి.. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ పిరిస్థితులకు వేదికైంది. మరి.. తిరుపతి ఓటర్లు ఏం తీర్పు ఇస్తారో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?