టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు పలుకుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయం గందరగోళంలో పడిందని ఆయనకు గిట్టని వాళ్లు అంటున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అధికార వైసీపీ నేతలే పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్చార్జినని చెప్పడమే కాకుండా పార్టీ తరఫున ఎమ్మెల్యేను అని కూడా స్వయంగా ప్రకటించుకున్న తరుణంలో వంశీకి కొత్త పరిణామాలు షాకిస్తున్నాయని సమాచారం.
బాబును భలే బుక్ చేసేశాడుగా!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై విరుచుకు పడటంలో వంశీ ముందుంటారనే సంగతి తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం ఘటనలో వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయని రమేష్ హాస్పిటల్ యాజమాని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముందని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు తయారయ్యాడని ఆరోపించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కులం రంగు పూస్తున్నాడని, రమేష్ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా? ` అని వల్లభనేని వంశీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీరును తప్పుపట్టారు. అంతేకాకుండా, తెలంగాణలో కోవిడ్ హాస్పిటళ్లు తప్పు చేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోలేదా ? అని వల్లభనేని వంశీ ప్రస్తావించారు. కరోనా మహమ్మారి ఉధృతం, లాక్ డౌన్ విధించిన గత 5 నెలల్లో 4 రోజులు మాత్రమే చంద్రబాబు నాయుడు ఏపీలో ఉన్నారని వంశీ వివరించారు. రాష్ట్రంలో పనిలేని బాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.
కానీ వైసీపీలోనే కష్టాలు పడుతున్నాడు
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని వంశీ చెడుగుడు ఆడుకుంటున్నప్పటికీ అధికార పార్టీలో కష్టాలు తప్పడం లేదంటున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలుగా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వ్యవహరిస్తున్నారు. క్యాడర్ కూడా వీరి వెనుకే ఉంది. తానే నియోజకవర్గ వైసీపీ నేత అని యార్లగడ్డ ఎప్పుడో ప్రకటించేశారు. అయితే డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత తన పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే, నియోజకవర్గ ముఖ్య నేత దుట్టా రామచంద్ర రావు అల్లుడు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు వంశీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారట
వైఎస్ కుటుంబానికి దగ్గరి మనిషితో
శివభరత్ రెడ్డి తను వైఎస్ కుటుంబానికి చెందిన వాడిని అని చెబుతూ నియోజకవర్గంలో కావాల్సిన పనులు చేయించుకున్నారని సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ వైసీపీ కండువా కప్పుకోలేదు. అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యేని వైసీపీ పార్టీ ఇంచార్జి అని చెప్పుకోవడం ఏమిటి అనే ప్రచారాన్ని సైతం వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ గన్నవరం నియోజకవర్గ ముఖ్య నేతలుగా గుర్తింపు పొందిన యార్లగడ్డ, దుట్టా రామచంద్రరావులు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో సహజంగానే వల్లభనేని వంశీకి వైసీపీ క్యాడర్ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉన్నప్పటి కంటే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నట్లు వంశీ మథనపడిపోతున్నట్లు సమాచారం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు మంత్రి కొడాలి నానితో మంత్రాంగం నెరిపే పనిలో ఉన్నారంటున్నారు.