మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్ద రచ్చకు దారి తీస్తొంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయంలో ఆయనను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అవ్వడం, ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయనను కూల్ చేసే విధంగా వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడనీ, తాను రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.
తనకు, వెంకటరెడ్డికి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందు వల్లనే ఆయన అపార్ధం చేసుకున్నట్లు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీని ముంచేందుకు ప్రయత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్ట్ ల గురించి తేల్చేందుకే చుండూరుకు వస్తానని ప్రకటించాననీ, నిజాయితీపరుడైతే తమతో చర్చకు రావాలని రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అపోహలతో మా వెంకన్న (వెంకటరెడ్డి) మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
మరో పక్క తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి బ్రాండ్ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర దశాబ్దాలుగా పని చేస్తున్నాననీ, తెలంగాణ కోసం మంత్రిపదవికి రాజీనామా చేశానని వెంకటరెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకు ముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనకు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారని తెలిపారు.
టార్గెట్ చంద్రబాబు: కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ కు మంత్రి పదవి ఖాయం చేసిన సీఎం వైఎస్ జగన్