తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు రీసెంట్ గా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని, పార్టీ మార్పునకు సంబంధించి ఆయన లేఖను కేసిఆర్ తమ పార్టీ ప్రతినిధుల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇప్పటికే కొద్దిగా పేరు మార్పుతో బీఆర్ఎస్ పేరుతో రెండు మూడు ధరఖాస్తులు ఈసీ వద్ద పెండింగ్ లో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే టీఆర్ఎస్ కు సంబంధించి పార్టీ పేరు మార్పు అంశంపై ఇంత వరకూ ఈసీ నుండి ఆమోదం రాలేదు. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ గుర్తింపును అడ్డుకునేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు.
టీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం బీఆర్ఎస్ గా గుర్తించకుండా నిలువరించాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయను న్నట్లు తెలుస్తొంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాను దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు వచ్చే వరకూ సదరు పార్టీ పేరు మార్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారుట. ఎందుకంటే .. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ కోసం విరాళాలు వసూలు చేశారని ఆరోపిస్తూ గతంలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నిధుల వసూళ్లలో పాల్గొంటే వారు నేరానికి పాల్పడినట్లే అవుతుందనీ, ఇది లంచం తీసుకోవడంతో సమానం అని రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.
‘గులాబీ కూలీ’ పేరుతో టీఆర్ఎస్ నేతలు వందలాది కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు గతంలో ఈసీని కోరినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 2018 నుండి తాను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉందనీ, ఆ కేసులో కోర్టు తీర్పు ఇస్తే టీఆర్ఎస్ తన గుర్తింపును కోల్పోతుందని అంటున్నారు.రేవంత్ రెడ్డి దాఖలు చేయబోయే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది..? మద్యంతర ఉత్తర్వులు ఏమైనా ఇస్తుందా..? లేక ఈసీనే స్పందిస్తుందా..?. రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సఫలం అవుతావా..? కావా అనేది ఆసక్తికరంగా మారింది.
హిందూపురం వైసీపీ నేత దారుణ హత్య .. ఎమ్మెల్సీపై ఆరోపణలు ..స్థానిక పోలీస్ అధికారులపై వేటు