హైదరాబాద్: తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదు అన్న చందంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిర్వేదం ఉందని టిపిసిసి ప్రచార కమిటి చైర్మన్ విజయశాంతి అన్నారు. ఉంటే మా తోనే ఉండాలి మమ్మల్ని వ్యతిరేకిస్తే దేశద్రోహులు అన్న చందంగా బిజెపి రాజకీయం చేస్తోందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చాలా భావోద్వేగంతో కామెంట్ చేయడం ఆశ్చర్యంగా ఉందని విజయశాంతి పేర్కొన్నారు.
గత ఐదేళ్ళ కాలంలో టిఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తే తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు, లేకపోతే తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించిందని ఆమె అన్నారు. ఈ రోజు కెటిఆర్ అభిప్రాయం ఎలా ఉందో సరిగ్గా అదే అభిప్రాయంతోనే ఇంత కాలం ప్రతిపక్షాలన్నీ అంతర్మథనంతో, ఆవేదనతోనూ కొట్టుమిట్టాడుతున్నాయిని పేర్కొన్నారు.
ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషించదగిన పరిణామమని విజయశాంతి అన్నారు. రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలనీ, ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని విజయశాంతి అన్నారు.