కిడ్నాపర్ల వీరంగం రోజురోజుకూ మితిమీరిపోతోంది. డబ్బులకు కక్కుర్తి పడి సొంత కుటుంబంలోని వారినే కిడ్నాప్ చేయడానికి వెనుకాడటం లేదు. మరీ ముఖ్యంగా ఏమీ తెలియని చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీనిలో చాలా మంది చిన్నారులు కిడ్నాపర్ల బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. మరి కొంత మంది రక్షించబడ్డారు. ఎంతో గారాబంగా పెంచుకున్న పిల్లల్ని ఇలా కిడ్నాపర్లు ప్రాణాలు తీసేస్తుంటే ఆ తల్లి దండ్రుల బాధ వర్ణనాతీతం. మనం చూస్తూనే ఉన్నాం.. టీవీల్లోనూ, పేపర్లోనూ.. బాలుడు కిడ్నాప్ లేక బాలిక కిడ్నాప్… ఇంత డబ్బు చెల్లిస్తే విడిచిపెడతానన్న కిడ్నాపర్ అని..
రీసెంట్ గా తెలంగాణలోని మహబూబాబాద్ పట్టణంలో లో ఇలాంటి ఘటనే అందరినీ కంటతడి పెట్టించింది. డబ్బులకోసం ఓ బాలుడిని కిడ్నాప్ చేశాడో దుండగుడు. కాని కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే బాలుడిని అతి దారుణంగా గొంతునులిమి చంపేశాడు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్ లో కూడా కిడ్నాప్ కు ఒడిగాట్టాడు ఓ వ్యక్తి. కాని సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు అందరి చేత శభాశ్ అనిపించుకున్నారు.
మూడేళ్ల బాలికను ఓ వ్యక్తి అపహరించి లలిత్ పూర్ రైల్వే స్టషన్ లో భోపాల్ వెళ్లే ఓ ట్రైన్ ఎక్కాడు. దాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రుు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దానితో పోలీసులు లలిత్ పూర్ స్టేషన్ లోని రైల్వే పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి కిడ్నాపర్ ఆ బాలికను తీసుకుని రప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కినట్లుగా గుర్తించారు. దాంతో రైల్వే పోలీస్ ఇన్స్ పెక్టర్ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి లోకో పైలెట్ తో మాట్లడి ఆ ట్రెయిన్ భోపాల్ వరకు ఎక్కడా ఆగకుండా తీసుకెళ్లాలని సూచించారు. దాంతో ఉత్తర ప్రదేశ్ లోని లలిత్ పూర్ స్టేషన్ నుంచి బయలు దేరిన ఆ ట్రెయిన్ మధ్యలో ఎక్కడా ఆగకుండా సుమారు 243 కి.మీ. దూరం ప్రయాణించి భోపాల్ స్టేషన్ లో ఆగింది.
అప్పటికే లలిత్ పూర్ రైల్వే పోలీసుల అప్రమత్తం వల్ల భోపాల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంకేముంది భోపాల్ పోలీసులు ఆ కిడ్నాపర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ బాలికను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల సమయ స్ఫూర్తితోనే ఆ బాలిక తిరిగి వారి తల్లిదండ్రులను చేరుకుంది. ఇలాగే పోలీసులు కిడ్నాపర్ల పట్ల అప్రమత్తంగా ఉంటే చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోకుండా ఉంటారు. తమ తల్లిదండ్రులకు పుత్ర శోకం లేకుండా చేసినవారవుతారు.