(ఫైల్ ఫోటో)
అమరావతి, మార్చి 25: రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుండి నటి, ట్రాన్స్జెండర్ (హిజ్రా) తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఈ నియోజకవర్గ నుండి టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, వైసిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితర పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ దాఖలు చివరి రోజైన సోమవారం నటి ట్రాన్స్జెండర్ తమన్నా సింహద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్వార్థపూరిత రాజకీయాల విముక్తి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు హిజ్రా సంఘ నేత తమన్నా సింహద్రి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి సారిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన తమన్నా సింహద్రి మీడియాతో మాట్లాడుతూ వ్యభిచార రాజకీయాలకు స్వస్తి పలకడానికి రాజకీయాల్లోకి వచ్చానని తమన్నా చెప్పారు.
నేను ఒక సన్యాసిని, 24గంటలు ప్రజలకు అందుబుటులో ఉండి సేవలు అందిస్తానని తమన్నా హామీ ఇచ్చారు. రాజధాని అమరావతికి మంగళగిరి నియోజకవర్గం కీలకమని పేర్కొన్నారు. నారా లోకేష్ ఎమి ఆశించి ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని తమన్నా సింహద్రి ప్రశ్నించారు. భూకబ్జాల కోసమే లోకేష్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని తమన్నా ఆరోపించారు. ట్రాన్స్జండర్లు అందరూ హక్కల సాధన కోసం, మెరుగైన సమాజం కోసం భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పిలుపు నిచ్చారు.
తాను మొదట జనసేన పార్టీ నుండి టికెట్ ఆశించాననీ, అయితే వారు నిరాకరించారని తమన్నా తెలిపారు. హిజ్రాలు నాలుగు గోడలకే పరిమితం కాకూడదని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధపడినట్లు తమన్నా సింహద్రి తెలిపారు.
తమన్నా కొన్నాళ్లుగా మీడియా, యూట్యూబ్ చానళ్ల దర్వారా ట్రాన్స్జెండర్ల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. నటి శ్రీరెడ్డికి మొదట మద్దతిచ్చిన తమన్నా తరువాత ఆమెను వ్యతిరేకిస్తూ మీడియాలో విమర్శలు కురిపించింది.