తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకీ భారీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఇదే కారణంతో ఏపీకి చెందిన అనేక మంది హైదరాబాద్ నుంచి ఇప్పుడు సొంత రాష్ట్రానికి తిరుగుప్రయాణమవుతున్నారు. దీంతో ఆంధ్రాకు వెళ్లే రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్లతోపాటు ఏపీ సరిహద్దుల వద్ద ఉన్న చెక్పోస్టుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కేవం పాస్లు ఉన్నవారిని మాత్రమే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. అయితే ఆ పాస్ను ఎలా తీసుకోవాలి ? అందుకు ఏ వెబ్సైట్ను సందర్శించాలి ? వంటి వివరాలను స్టెప్ బై స్టెప్లో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోకి వెళ్లేందుకు గాను ప్రయాణికులు ఆ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్పందన అనే వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి ముందుగా అందులో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ వివరాలను పరిశీలించి అర్హులైన వారికి పాస్లను ఇస్తారు. ఆ పాస్లతో ప్రయాణికులు ఏపీకి వెళ్లవచ్చు.
ఏపీ పౌరులు ఆ రాష్ట్రంలోకి వెళ్లేందుకు ఈ-పాస్/ట్రావెల్ పర్మిట్ను స్పందన వెబ్సైట్లో ఇలా తీసుకోవాలి.
* స్పందన వెబ్సైట్ (https://www.spandana.ap.gov.in/) ను ఓపెన్ చేసి అందులో హోం పేజీలో ఉండే కోవిడ్ 19 మూవ్మెంట్ ఫర్ పీపుల్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. దాంతో మరొక విండో ప్రత్యక్షమవుతుంది.
* అందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ పాస్ అనే ఆప్షన్ను డ్రాప్ డౌన్ మెనూ నుంచి ఎంచుకోవాలి. దాంతో రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
* రిజిస్ట్రేషన్ ఫాం కోసం http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration.aspx అనే లింక్ను కూడా నేరుగా ఓపెన్ చేయవచ్చు.
* ప్రస్తుతానికి ఏపీలోకి కేవలం విద్యార్థులు, భక్తులు, వలస కార్మికులను మాత్రమే అనుమతిస్తున్నారు. కనుక ఈ విభాగాలకు చెందిన వారు మాత్రమే ఏపీకి వెళ్లేందుకు స్పందన వెబ్సైట్లో పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇతరులు పాస్ కోసం అప్లై చేస్తే దాన్ని పొందేందుకు వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.
రిజిస్ట్రేషన్ ఫాంలో ఈ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది…
* ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి లేదా ఇతర రాష్ట్రం నుంచి ఏపీకి వలస వస్తున్నారో, వెళ్తున్నారో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు అయితే ఇతర రాష్ట్రం నుంచి ఏపీకి వెళ్తున్నట్లుగా రిజిస్టర్ చేసుకోవాలి.
* పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వయస్సు, లింగం వివరాలను నమోదు చేయాలి.
* పౌరులు ప్రస్తుతం ఉంటున్న ప్రదేశం, ఏపీలో వెళ్లాలనుకునే ప్రదేశాలకు చెందిన పూర్తి చిరునామాలను తెలపాలి. ఆయా ప్రదేశాలు రెడ్, ఆరెంజ్ లేదా గ్రీన్.. ఏ జోన్లో ఉన్నా సరే.. రెండు ప్రదేశాలకు చెందిన పూర్తి చిరునామాలను ఇవ్వాల్సి ఉంటుంది.
* వివరాలను నమోదు చేశాక పౌరులు తాము ప్రయాణించే వాహన వివరాలను ఎంటర్ చేయాలి. అది సొంత, ప్రభుత్వ లేదా పెయిడ్ వాహనం.. ఏదైనా సరే.. దాని వివరాలను ఇవ్వాలి. ఇక అందులో ఎంత మంది వెళ్తున్నారు, ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు అనే వివరాలను తెలపాలి. విద్యార్థా, భక్తులా, వలస కార్మికులా అనే వివరాలను తెలపాలి.
* ఈ వివరాలను తెలియజేశాక ఏపీలో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.
* పాస్కు రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మొబైల్ నంబర్కు పాస్ అప్లికేషన్ నంబర్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. ఆ నంబర్ సహాయంతో తమ పాస్ అప్లికేషన్ స్టేటస్ గురించి పౌరులు తెలుసుకోవచ్చు.
* పాస్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు http://spandana1.ap.gov.in/Registration/citizensearchstatus.aspx అనే వెబ్సైట్ను సందర్శించాలి.
ఏపీ సరిహద్దు దాటేందుకు వెళ్తున్న వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి…
* చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేశాకే, కోవిడ్ లక్షణాలు లేవని నిర్దారించుకున్నాకే సరిహద్దు దాటేందుకు అనుమతిస్తారు. లక్షణాలు ఉంటే హాస్పిటల్కు తరలించి కోవిడ్ పరీక్షలు చేస్తారు.
* ఏపీ సరిహద్దు వద్ద చెక్పోస్టు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పని చేస్తుంది. అందువల్ల ప్రయాణికులు ఏపీలోకి ప్రవేశించాలంటే కనీసం రాత్రి 7 గంటల ముందు వరకు అయినా సరిహద్దు వద్ద ఉండేలా జర్నీని ప్లాన్ చేసుకోవాలి.