స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఇప్పుడు బాగా పెరిగింది. టాప్ 6 లో ఎప్పుడూ అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది కానీ టాప్ 5 లో మాత్రం కాదు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ టాప్ స్థానానికి చేరువగా వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం.
ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. డబ్బులు పెట్టిన ప్రతీ ఒక్కర్ని సంతోష పెట్టింది ఆ చిత్రం. ఇక అల వైకుంఠపురములో తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు అల్లు అర్జున్. సుకుమార్ రంగస్థలం వంటి భారీ హిట్ తర్వాత ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. పుష్పపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. మొత్తంగా ఐదు భాషల్లో పుష్ప విడుదలవుతుంది. అందుకని కీలక పాత్రల కోసం వేరే భాషల్లో ఫేమ్ ఉన్న నటులను ఎంపిక చేసుకోవాలన్నది ప్లాన్. అందుకే వెర్సటైల్ సినిమాలతో పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతిని పుష్పలో విలన్ గా తీసుకున్నారు. అసలైతే పుష్పను మార్చ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలి. అది కుదరలేదు కాబట్టి విజయ్ సేతుపతి డేట్స్ వేస్ట్ అయ్యాయి. అందుకే అతను పుష్ప నుండి తప్పుకున్నాడు. బాబీ సింహా, నారా రోహిత్, అరవింద్ స్వామి వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ ఎవరూ సెట్ అవ్వలేదు. చివరికి బాలీవుడ్ నటులను కూడా తీసుకుందామా అన్న ఆలోచన వచ్చింది. ఇక లేటెస్ట్ ఇందులోకి మాధవన్ పేరు బయటకు వచ్చింది. మాధవన్ ఈ సినిమాలో విలన్ గా తీసుకోనున్నారు అనే వార్త హల్చల్ చేస్తోంది. సవ్యసాచి సినిమాలో మాధవన్ విలన్ గా నటించాడు. నిశ్శబ్దం చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి అల్లు అర్జున్ సినిమాలో మాధవన్ చేరిక నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అది ఎంతవరకూ సినిమాకు ప్లస్ కానుంది అన్నది తేలాలి.