మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. మునుగోడు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు సుమారు 25వేల ఓటు వరకూ ఓట్ బ్యాంక్ ఉంది. మునుగోడులో అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించేది వామపక్షాలేనని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఇంతకు ముందే ప్రకటించారు.మరో పక్క ముఖ్యమంత్రి కేసిఆర్ .. వామపక్షాల నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మద్దతుపై చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీ అభ్యర్ధిగా ఉప ఎన్నికల్లో నిలుస్తున్నందున ఆ పార్టీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకమునుపే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి ప్రధాన రాజకీయ పక్షాలు దిగాయి. మునుగోడు నియోజకవర్గంలో రేపు బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండగా, ఈ రోజు (20వ తేదీ) టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తొంది. ఈ బహిరంగ సభలోనే సీఎం కేసిఆర్ టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించనున్నారు.
సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగే బహిరంగ సభ నుండే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి హజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డికి ఆహ్వానించినట్లు తెలుస్తొంది. దీంతో సీఎం కేసిఆర్ వాహనంలోనే మునుగోడుకు చాడ వెంకటరెడ్డి చేరుకోనున్నట్లు సమాచారం. మునుగోడు సభ విజయవంతానికి టీఆర్ఎస్ భారీ ఎత్తున కసరత్తు చేస్తొంది. ఈ క్రమంలోనే రెండు వేల మందితో హైదరాబాద్ నుండి భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 4 గంటల వరకూ విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. వామపక్షాలు టీఆర్ఎస్ కు మద్దతు పలకడం కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామమే అని అంటున్నారు.