హైదరాబాద్: తెలంగాణాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ఆర్టీసీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం, అవసరమైన ధ్రువపత్రాలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ సమీపంలోని డిపో మేనేజర్లను సంప్రదించాలని నోటిఫికేషన్లో పేర్కొంది. పోస్టుల ఆధారంగా తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ విధానంలో పారితోషికం చెల్లిస్తారు. డ్రైవర్, కండక్టర్, మెకానికల్ సూపర్ వైజర్స్, మెకానిక్, శ్రామిక్, ఎలక్ట్రీషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బంది, ఐటీ ట్రైనర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తాత్కాలిక ప్రాతిపదికన దినసరి వేతనంతో వీరిని విధుల్లోకి తీసుకోనున్నారు. డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ.1000 అందించనున్నారు. అలాగే మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్ మెకానిక్, క్లరికల్ సిబ్బందికి రూ.1000 అందించనున్నారు.
మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక ప్రాతిపదికగా ప్రభుత్వం కార్మికుల నియామకం చేపట్టనుంది. యూనియన్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం… 48 వేల మంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టేనని ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యతో కార్మికవర్గాలు మరింత భగ్గుమంటున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉధృత చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి.