ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను దుండగులు దారుణంగా హత్య చేశారు. బైక్ పై ఇంటికి వెళుతున్న కృష్ణయ్యను ఆరుగురు వ్యక్తులు ఆటోతో ఢీకొట్టారు. ఆ తర్వాత వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో కృష్ణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
టేకులపల్లి ఆంధ్రా బ్యాంకు కర్షక సేవ సహకార సంఘం డైరెక్టర్ గా ఉన్న తమ్మినేని కృష్ణయ్య .. సీ పీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడు. తమ్మినేని కృష్ణయ్య సీపీఎంతో విభేదించి టీఆర్ఎస్ లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాజకీయ విభేదాలతో జరిగిన హత్యగా భావిస్తున్నారు.ఈ ఘటనతో తెల్దారుపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కృష్ణయ్య ను హత్య చేసిన దుండగుల కోసం పోలీసులు వెదుకుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.