YS Sharmila Party : తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ హాట్ టాపిక్ అవుతోంది. ముందు షర్మిల పార్టీ పై మౌనం పాటించిన టీఆర్ఎస్ ఇప్పుడు వాయిస్ పెంచింది.
షర్మిల నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన రోజు టీఆర్ఎస్ సోషల్మీడియా ఆమెకు వ్యతిరేక కామెంట్లు పెట్టగా ఆ పార్టీ అధిష్టానం వర్గమే వాటిని సాయంత్రానికి డిలెట్ చేయించింది.అయితే షర్మిల ఇంకా స్పీడ్ గా వెళ్తుండటం,ఖమ్మం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయడం,మరోవైపు టీఆర్ఎస్సే ఆమె వెనుక ఉందన్న ప్రచారం ప్రారంభం కావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతలు గొంతు సవరించుకున్నారు. షర్మిల పార్టీపై ఆ పార్టీ నాయకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ మొదలుకొని పలువురు షర్మిల పార్టీపై స్పందిస్తున్నారు.
YS Sharmila Party : కౌంటర్ ఇచ్చిన ఇద్దరు మంత్రులు!
ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను రానివ్వరని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. షర్మిల ఎవరి బాణం కాదని, ఏపీలో ఏం చేయలేక ఇక్కడికి వచ్చారని శ్రీనివాస్గౌడ్ వ్యాఖ్యానించారు. వైఎస్ మరణించి ఆరేళ్లు అయిపోయిందని, పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు. తెలంగాణలో చిరంజీవి, పవన్ పార్టీలు ఏమయ్యాయో చూశారని గుర్తుచేశారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదని శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు.
తెలంగాణలో షర్మిలే హాట్ టాపిక్!
అయితే మెజార్టీగా చూస్తే షర్మిల పార్టీని స్వాగతించే వారి సంఖ్య స్వల్పంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఆమె రాణించలేరని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి అభిమానులు మాత్రం నూతనోత్సాహంతో ఉన్నారు. వైసీపీ ఏపీకే పరిమితం కావడంతో తమ ప్రియతమ నేత రాజశేఖర్రెడ్డిని షర్మిలలో చూసుకోవాలని ముచ్చటపడుతున్నారు. షర్మిల పార్టీ పెట్టడం వెనుక అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ‘రెడ్డి’ సామాజికవర్గం బీజేపీలో చేరకుండా కట్టడి చేసేందుకే ఆమె పార్టీ పెడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాదుకాదు బీజేపీ మద్దతుతోనే షర్మిల పార్టీ పెడుతున్నారే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల పెట్టబోయే పార్టీపై తెలంగాణలో సీరియస్గా చర్చ జరుగుతోంది.