IPL 2021 : ఐపీఎల్ 2021 వేలానికి సంబంధించి ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లు లేకపోవడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జట్టుకు మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిన ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఉన్నాడని.. స్థానిక ప్లేయర్స్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. సన్రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానిక ఆటగాళ్లను తీసుకోవాలని.. లేకపోతే హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు.
జట్టులో హైదరాబాద్ ఆటగాళ్లకు స్థానం లేనప్పుడు ఎస్ఆర్హెచ్ పేరు వెంటనే మార్చాలంటూ ఆయన విమర్శలు గుప్పించారు.కాగా, మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక్క హైదరాబాద్ ఆటగాడిని కూడా కొనుగోలు చేయలేదన్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ.. ఎస్ఆర్హెచ్ జట్టులో ఒక్క హైదరాబాదీ ప్లేయర్ లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని కామెంట్ చేశారు.
IPL 2021 : ఇతర ఫ్రాంచైజీలకు భిన్నంగా!
ఐపీఎల్ 2021 వేలంలో ఫారిన్ స్టార్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించినా అదే సమయంలో డొమెస్టిక్ టాలెంటెడ్ ప్లేయర్లకు ప్రయారిటీ ఇచ్చాయి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న క్రికెటర్లతో పాటు ఫ్యూచర్ ఉంటుంది అనుకున్న ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. తమ స్టేట్స్కు చెందిన లోకల్ ప్లేయర్లను చాలా టీమ్స్ కొనుగోలు చేశాయి. ఇందుకు భిన్నంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తెలంగాణ నుండి ఒక్క క్రికెటర్ను కూడా తీసుకోలేదు. తెలంగాణనే కాదు …ఆంధ్ర ప్లేయర్లపై కూడా దయ చూపలేదు. లీగ్లో ఫస్ట్ టైమ్ ఒక్క లోకల్ ప్లేయర్ కూడా లేకుండానే సన్రైజర్స్ ఓ సీజన్ ఆడబోతోంది.ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది .
క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి…!
2013లో దక్కన్ చార్జర్స్ ప్లేస్లో లీగ్లోకి వచ్చిన సన్రైజర్స్ కూడా 2015 వరకూ నలుగురు ప్లేయర్లను తీసుకుంది. తర్వాతి మూడు సీజన్లలో ముగ్గురికి చాన్స్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి అక్షత్ రెడ్డి, డీబీ రవితేజ, టి. సుమన్, హనుమ విహారి, ఆశీష్ రెడ్డి, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, మెహ్దీ హసన్లకు… ఆంధ్ర నుంచి వేణుగోపాల్ రావు, రిక్కీ భుయ్కు లీగ్లో ప్రాతినిధ్యం కల్పించింది. 2017 ఆక్షన్లో మహ్మద్ సిరాజ్ను ఏకంగా 2.6 కోట్లకు కొనుగోలు చేసి స్టార్ని చేసింది. కానీ, గత రెండు సీజన్ల నుంచి తెలుగు రాష్ట్రాల క్రికెటర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. 2019లో రిక్కీ భుయ్ను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ గతేడాది బావనక సందీప్ను కొనుక్కుంది. సీజన్ మధ్యలో ఏపీకి చెందిన పృథ్వీరాజ్ను తీసుకుంది. కానీ, యూఈఏలో జరిగిన లాస్ట్ ఎడిషన్లోఒక్క మ్యాచ్లో అయినా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్లో ఇద్దరినీ రిలీజ్ చేసిన రైజర్స్ ఫ్రాంచైజీ ఆక్షన్లో తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ ఒక్కరిని కూడా తీసుకోకపోవడం శోచనీయం. కానీ, మనోళ్ల టాలెంట్ను ఇతర ఫ్రాంచైజీలు గుర్తించాయి. భగత్ వర్మ, హరి శంకర్ రెడ్డి (సీఎస్కే), యుధ్వీర్ సింగ్ (ముంబై), కేఎస్ భరత్ (ఆర్సీబీ)కు చాన్స్ ఇచ్చాయి.