ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సారి తన పేరు ప్రస్తావనకు రావడంతో కవిత స్పందించారు. తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకు రావడానికి ముందు ఈడీ రావడం కామన్ అని విమర్శించారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తొందని అన్నారు. మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోడీ వచ్చే ముందు రాష్ట్రానికి ఈడీ వచ్చిందన్నారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదని కవిత అన్నారు. తన పై కేసులు రాజకీయ ఎత్తుగడలో భాగమనేనని విమర్శించారు. తనపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని అన్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్దమని కవిత పేర్కొన్నారు. ,తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారు అంతకు మించి వారు చేసేది ఏముంది. అరెస్టులకు భయపడేది లేదని అన్నారు. మీడియాకు లీకులు ఇచ్చి తమ పరపతి (ఇమేజ్) ని దెబ్బతీయలేరని అన్నారు. దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు అడిగితే సమాధానమిస్తానని తెలిపారు. సీబీఐ, ఈడీ అన్నింటికీ ఎదుర్కొంటామని చెప్పారు. పద్ధతి మార్చుకోవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈడీతో గెలవాలనుకుంటే తెలంగాణలో కుదరదని అన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నంత కాలం తమను ఇబ్బంది లేదని కవిత స్పష్టం చేశారు.