Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామని, హైదరాాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని సీబీఐ నోటీసులో వెల్లడించింది. సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశాన్ని ఎమ్మెల్సీ కవిత దృవీకరించారు. డిసెంబర్ 6న తన నివాసం వద్దనే వివరణ ఇస్తానని కవిత వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఈడీ తొలి సారిగా కవిత పేరును ప్రస్తావించింంది. కవితతో సహా పలువురు పేర్లు ప్రస్తావించిన ఈడీ వారు ఆధారాలను మాయం చేసేందుకు వారు వాడిన ఫోన్ లను ధ్వంసం చేసినట్లుగా పేర్కొంది. ధ్వంసం చేసిన సెల్ ఫోన్ల విలువే 1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది. తొలి సారిగా కవిత పేరు ఈడీ ప్రస్తావించిన నేపథ్యంలో ఆమె మీడియా సమావేశంలో కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మోడీ వచ్చే ముందు రాష్ట్రాలకు ఈడీ వస్తుందని కవిత విమర్శించారు. ఎటువంటి విచారణకు కైనా తాను సిద్దమేనని తెలిపారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ కుట్రగా ఆమె విమర్శించారు. కవితకు సీబీఐ నుండి నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఢిల్లీలో బీజేపీ నేతలు .. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందంటూ ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. తెలంగాణలోనూ ప్రతిపక్ష పార్టీలు కవితపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడంతో కోర్టును ఆశ్రయించి ఆర్డర్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు నేరుగానే ఈడీ .. అమిత్ ఆరోరా రిమాండ్ కవిత పేరును ప్రస్తావించడం, మరో పక్క సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికినట్లు అయ్యింది.