టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు రైతులకు ఏమాత్రం ఉపయోగపడేవి కావని కేశవరావు స్పష్టం చేశారు. ఈ బిల్లు వల్ల రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని బీజేపీ హామీ ఇవ్వగలదా? అని ప్రశ్నించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా పూర్తిగా కేంద్రానికి పక్షపాతంగా వ్యవహరించారని కేకే మండిపడ్డారు. అసలు.. బీజేపీకి రాజ్యసభలో బలమే లేదు. అయినప్పటికీ.. సభలో వ్యవసాయ బిల్లును ఎలా ఆమోదింపజేసుకున్నారు.. అంటూ ఎంపీ మండిపడ్డారు.
నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి ఘటనను చూడలేదు. ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా ఏ బిల్లు కూడా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు. వ్యవసాయ రంగాన్ని బీజేపీ కార్పొరేట్ మయం చేయబోతోంది. బిల్లుపై ప్రతిపక్షాలు సవరణలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు. డిప్యూటీ చైర్మన్ వాటిని అసలు పరిగణనలోకే తీసుకోలేదు.. అంటూ కేకే వెల్లడించారు.
టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యాంగ వ్యతిరేక బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. డిప్యూటీ చైర్మన్ కేంద్రానికి పక్షపాతం వ్యవహరించడాన్ని నిరసిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన్ని పెట్టారు. దానికి టీఆర్ఎస్ ఎంపీలందరం మద్దతిచ్చాం. మొత్తం 12 పార్టీలు డిప్యూటీ చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. 50 మంది ఎంపీలు సంతకాలు పెట్టారు. ఓవైపు అవిశ్వాస తీర్మానం పెండింగ్ లో ఉన్నప్పుడు… సభకు చైర్మన్ గా ఉండే అవకాశం డిప్యూటీ చైర్మన్ కు ఉండదు. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి వ్యవసాయ బిల్లును ఆమోదింపజేసుకున్నారని కేకే మండిపడ్డారు.
ఇక.. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను.. మూజువాణి ఓటుతో రాజ్యసభలోను ఆమోదింపజేసుకున్నారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందినట్టుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు.