TRS MPs: పార్లమెంట్ నుండి టీఆర్ఎస్ ఎంపిలు మాయమవబోతున్నారు అంటూ ఒక రోజు ముందుగానే టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి వెల్లడించినట్లుగానే నేడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ బహిష్కరించింది. వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించినట్లు టీఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. తదుపతి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావు మాట్లాడుతూ సభను బాయ్ కాట్ చేయడం బాధకల్గించే విషయమన్నారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు. తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్రం చెబుతోందన్నారు. రబీలో పూర్తిగా ఉప్పుడు బియ్యం మాత్రమే వస్తుందన్నారు. అందుకే రబీ ధాన్యం బాయిల్డ్ రైస్ గా మారుస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్ సి ఐ నిర్లక్ష్య వహిస్తోందని ఆయన విమర్శించారు. యార్డ్ ల్లో ఉన్న ధాన్యాన్ని ఎఫ్ సీ ఐ తరలించకపోవడంతో ధాన్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
TRS MPs: రేవంత్ చెప్పినట్లుగా టీఆర్ఎస్ ఎంపీల చర్యలు
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. టిఆర్ఎస్ ఎంపీలు మంగళవారం నుండి పార్లమెంట్ లో నిరసనలు ఉండవనీ, మధ్యాహ్నం తర్వాత వారు పార్లమెంట్ నుండి మాయమవబోతున్నారని రేవంత్ రెడ్డి ముందే వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. కేంద్రం నుండి తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు అందడం వల్లనే టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు ఆపేసి వెళ్లిపోతున్నారని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసలు తెలుపుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపిలు ఏమి చేయబోతున్నారు అన్న విషయాన్ని ముందగా రేవంత్ రెడ్డి చెప్పడంతో ఆయనకు టీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు అనుగుణంగానే టీఆర్ఎస్ ఎంపీల చర్యలు ఉండటంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.