TRS : నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ … బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే… బీజేపీ నేతను కారెక్కించుకుని భారీ షాక్ ఇచ్చింది. నియోజకవర్గంలో మరింత మంది కమలనాథులకు గులాబీ తీర్థం ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో జానారెడ్డి అనుచరులను గులాబి పార్టీలో చేర్చుకుంటూ… రెండు జాతీయ పార్టీలకు గుక్క తిప్పుకోకుండా చేస్తోంది టిఆర్ఎస్.
TRS : అద్భుతమైన స్కెచ్ తోఅడుగులేస్తున్న టీఆర్ఎస్!
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయిన నాటి నుంచి అభ్యర్థులను ఖరారు చేయడంపై ఆచితూచి వ్యవహరించిన టీఆర్ఎస్, బీజేపీలు నామినేషన్ల ముగింపునకు ఒక రోజు ముందు అభ్యర్థిని ఖరారు చేశాయి. అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతుండడంతో వారిలో అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపి కూడా చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేస్తూ వచ్చింది. టికెట్లు ఆశించిన నేతలందరితో ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగించారు. ఆ తర్వాతే అభ్యర్థిని ప్రకటించారు. పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తామని నచ్చచెప్పి నోముల భగత్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అదే రోజు కమలనాథులు కూడా తమ అభ్యర్థిని ప్రకటించారు. కాని అధికారపార్టీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలెవరూ బీజేపికి దగ్గరకాలేదు. దానికి తోడు గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా కొత్తగా మరో అభ్యర్థిని బిజెపి ఖరారు చేసింది.
వికటించిన బిజెపి వ్యూహం!
అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ పావులు కదిపితే అది బూమరాంగ్ అయ్యింది. బీజేపి నుంచి టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్ ను కారెక్కించుకుని గులాబి పార్టీ సాగర్ నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెట్టింది. అంజయ్య సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన నివేదితారెడ్డి కూడా అధికార పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీపై అసంతృప్తిగా ఉన్న నివేదితా దంపతులు కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని కమలనాథులు పావులు కదిపినా.. గులాబీ పార్టీ చేపట్టిన ఆకర్ష్ తో కమలనాథులకు ఉప ఎన్నికల్లో కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో దూకుడు పెంచిన కమలనాథులకు సాగర్ ఎన్నికలతో చెక్ పెట్టాలని గులాబి దళపతి కేసిఆర్ పావులు కదుపుతున్నారు.
కాంగ్రెస్ నేతలపైనా వల!
త్వరలో మరికొందరు బీజేపీ నేతలు కూడా కారెక్కేందుకు సిద్ధంగా ఉండడంతో దశల వారిగా వారందరినీ గులాబి గూటికి చేర్చుకునేలా అధికార పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానా రంగంలోకి దిగడంతో ఆయన ప్రధాన అనుచరులను, స్థానిక సంస్థల ప్రతినిధులను కారెక్కించుకునే దిశగా నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కొంతమంది గులాబీ కండువాలు కప్పుకోవడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇంకెంత మరి నేతలు కారెక్కుతారో చూడాలి.