దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన టీఆర్ఎస్ పార్టీకి త్వరలో జరగబోయే మరో ఉపఎన్నిక తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవలే నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది.దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపి కారణంగా తలబొప్పికట్టిన టీఆర్ఎస్ కి నాగార్జునసాగర్లో కాంగ్రెస్ నుండి గట్టిపోటీ తప్పకపోవచ్చని అంటున్నారు.2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పదహారు వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యను ఓడించారు.అయితే 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య ఏడున్నర వేల ఓట్ల మెజారిటీతో జానారెడ్డిలపై గెలుపొందారు.అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరవై అయిదు వేల ఓట్ల ఆధిక్యతతో గెలుచుకున్నారు.
ఇదే సందర్భంలో నాగార్జున సాగర్లో కూడా కాంగ్రెస్ కి స్వల్ప ఆధిక్యత లభించింది.ఈ లెక్కన చూస్తే నాగార్జునసాగర్లో కాంగ్రెస్ బలంగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.అసలు నల్లగొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట వంటిది .మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఉన్న భువనగిరి లోక్సభ నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గెలుచుకున్నారు.కాబట్టి రేపటి ఉప ఎన్నికలో కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు నాగార్జుసాగర్ పై ఫోకస్ పెట్టే అవకాశాలు లేకపోలేదు.నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా సింపతీ ఓట్లు రాబట్టుకు౦దామనుకొనే టీఆర్ఎస్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది అనుమానాస్పద౦.దుబ్బాకలో కూడా మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్యకే టిక్కెట్ ఇచ్చినప్పటికీ అక్కడ బిజెపి గెలవడం ఇక్కడ గమనార్హం.అయితే దుబ్బాక గ్రేటర్ హైద్రాబాదు ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చిన నేపధ్యంలో నాగార్జున సాగర్ విషయంలో టీఆర్ఎస్ కూడా జాగ్రత్తపడుతుందనేది నిర్వివాదాంశం.