ఏపీ రాజధాని విషయంలో వైసీపీలో ఉన్నాడో లేదో కూడా తెలియని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేలు పెట్టారు.ఆయన స్క్రిప్ట్ రైటర్ ఎవరో గానీ మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాసును మరిపిస్తున్నారు.
మూడు రాజధానుల విషయంలో సాక్షిని కాదు మనస్సాక్షిని నమ్మండి అంటూ ముఖ్యమంత్రి జగన్ కు,ఈ విషయంలో చేయాల్సింది రాజీనామాలు కాదు రాజీలేని పోరాటం అంటూ జనసేనాని పవన్ కల్యాణు కి రఘురామకృష్ణంరాజు పంచ్ డైలాగులు వేశారు.ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
తానైతే అమరావతికి అండగా నిలబడతానని కూడా ఎంపీ చెప్పకనే చెప్పారు.తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి మహిళలు, రైతుల వెనక ఉండి పోరాటం చేస్తానని చెప్పారు.పనిలో పనిగా అమరావతి రాజధానిని కాపాడుకునే పోరాటాన్ని మహిళలే ముందుండి నడపాలని రాణి రుద్రమ అబ్బక్క వంటి వీర నారి మణులను వారు ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు .కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందని తెలిపారు.సెక్షన్ 94(3) ద్వారా ఒకే రాజధానిలో రాజ్భవన్, హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టంగా ఉందని.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది’’అని రఘురామకృష్ణరాజు వివరించారు.ఈ సందర్భంగా కృష్ణా గుంటూరు జిల్లాల టిడిపి వైసిపి నేతలు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్పై ఆయన స్పందిస్తూ ఇప్పుడు కావాల్సింది రాజీనామాలు కాదని రాజీ లేని పోరాటం అని చెప్పారు.టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి తన పదవికి రాజీనామా ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని కూడా ఎంపీ సూచించారు.
అంతేగాకుండా నేరుగా సీఎంను ఉద్దేశించి సీఎం గారూ… ఈ విషయంలో సాక్షిని కాకుండా మనస్సాక్షి ని నమ్మండి రెఫరెండం పెట్టి ప్రజాభిప్రాయం తెలుసుకోండి అని రఘురామకృష్ణం రాజు కోరారు.వృద్దాప్య పింఛన్లు పెంచడానికే మన దగ్గర డబ్బుల్లేవు మూడు రాజధానులు కట్టగలమా అని ఆలోచించమని జగన్కు సలహా ఇచ్చారు.చివరగా తనను రాజీనామా చేయమని కోరుతున్నా వైసిపి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే
అమరావతి విషయంలో రెఫరెండం కింద ఎన్నికలు పెట్టి ప్రజల్లోకి వెళితే వారు ఇందుకు ఆమోదం తెలిపితే ఈసారి 175 స్థానాలు వస్తాయి కదా అని కూడా ఆయన కొత్త మెలికపెట్టారు.ఇది ప్రభుత్వానికి, సీఎంకు తాను ఇచ్చే సూచనే తప్ప పార్టీకీ, పార్టీ అధ్యక్షుడికి కాదని స్పష్టం చేశారు.ఏదేమైనా వేలి కేస్తే కాలికి కాలికేస్తే వేలికి ముడిపెడుతున్న ఎంపీ గారి వైఖరి వైసిపికి ఇబ్బందికరంగానే ఉందన్నది వాస్తవం.