తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త సచివాలయ నిర్మాణంపై అడుగులు చకచకా ముందుకు పడుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలు, కోర్టు వివాదాలు, రకరకాల సెంటిమెంట్లు.., వాస్తు అంశాలు అన్నిటినీ దాటుకుంటూ వస్తున్నా తెలనగానా సర్కారు ఎట్టకేలకు సచివాలయం విషయంలో ఒక స్పష్టతకి వచ్చింది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన సచివాలయం ఆకృతిని ఖరారు చేశారు. దూరం నుండి చుస్తే తాజ్ మహల్ తరహాలో కనిపించే ఈ కట్టడం చారిత్రిక నేపథ్యంలో రాజకోట ఆకృతిలో డిజైన్ చేయించారు.
నిజానికి గత ఏడాది జూన్ లోనే కొత్త సచివాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంఖుస్థాపన చేసారు. కానీ ఈ ఏడాదిలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు. పాత భవనాన్ని కూల్చడానికి, కొత్తది కట్టడానికి విపక్షాలు అంగీకరించలేదు. కొందరు కోర్టుకి వెళ్లారు. కోర్టు కూడా కొన్ని అభ్యంతరాలను తెలిపింది. ఏడాది పాటు తాత్సారం జరిగిన ఈ కట్టడంపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. కోర్టుకి, విపక్షాలకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. చివరకు కోర్టులో నెగ్గి.., కొత్త డిజైన్ కి తుది రూపునిచ్చింది. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ దీన్ని చూపించి ఆమోదించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.