TRS: టీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. మునుగోడు ఉప ఎన్నికల వేళ .. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన ఎనిమిది గుర్తులను స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ ఆ పార్టీ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేస్తూ టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో మరో సారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ఎనిమిది ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న విషయాన్ని మరో సారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ గుర్తులు స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్ధికి నష్టం జరుగుతుందని ఆయన ఈసీ కి తెలిపారు. ఈ అంశంపై పరిశీలన జరిపి కారును పోలిన ఎనిమిది గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని ఆయన కోరారు. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ముందే టీఆర్ఎస్ నేతల బృందం ఈసీని కలిసి ఇదే అంశంపై వినతి పత్రాన్ని సమర్పించింది. అయితే అక్కడ నుండి స్పంధన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ కావడంతో మరో సారి ఈసీని సంప్రదించింది టీఆర్ఎస్.
మరో పక్క నిన్న రాత్రి టీఆర్ఎస్ శ్రేణులు నిన్న రాత్రి చండూరు ఆర్ఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ ఆర్ ఓ కార్యాలయం వద్ద భైటాయించి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు. ఈ అంశంపై టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు డజన్ల మందికి పైగా స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ప్రధాన రాాజకీయ పార్టీలతో పాటు మొత్తం 47 మంది పోటీలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన జరగనుంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని వెల్లడించనున్నారు.