(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిలుపుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ ప్రజా ప్రయోజన వాజ్యంను దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థనతో అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే పిటిషన్పై విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొంది.
సుప్రీం కోర్టు తీర్పునకు భిన్నంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసిలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదనీ, విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్ లు వేరువేరు అని న్యాయవాది వాదించారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు.. పిల్ దాఖలు చేసిన శ్రవణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పదేళ్ల క్రితమే తీర్పు ఇస్తే ఇప్పటి వరకూ ఏం చేశారు, ఎంబీసీలపై ప్రేముంటే ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదు. ఎన్నికల షెడ్యుల్ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తుకు వచ్చిందా అని ఘాటుగా ప్రశ్నించింది. దురుద్దేశంతో, ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్ దాఖలు చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2015, 2016 లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని న్యాయస్థానం.. రిజిస్ట్రార్ను ఆదేశిస్తూ, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.