(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో రోజుకు 50వేల కోవిడ్ పరీక్షలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో విచారణకు ముందు పరీక్షలు పెంచి తరువాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా పరీక్షలను రాష్ట్రంలో లక్ష వరకూ పెంచాలని ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా రెండవ దశ ముప్పు పొంచి ఉందని ఇలాంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కానీ భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలనీ, ప్రజలు మార్గదర్శకాలు పాటించేలా ప్రభుత్వం అవగాహన కల్పించాలని పేర్కొన్నది. కరోనా చికిత్సల పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసిన వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.