AP-TS: ఏపీ-తెలంగాణ AP-TS రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అలజడి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఇరు రాష్ట్రాల నేతల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతోంది. రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత లేని మాటలు అప్పుడప్పుడూ కొన్ని రాజకీయ వైషమ్యాల నేపథ్యంలో వస్తూంటాయి.. ఉద్రిక్తలు రేపుతూంటాయి. గతంలో టీడీపీ హయాంలో ఓటుకు నోటు కేసు సమయంలో ఓసారి ఇలా జరిగింది. ఇప్పుడు మళ్లీ మాటల సెగలు రేగుతున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలకే ఏపీ మంత్రి కొడాలి నాని.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై మళ్లీ శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తోసహా.. టీఆర్ఎన్ నేతలు కొందరు వైఎస్ ను జల దొంగ అని.. నరరూప రాక్షసుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఏపీ మంత్రులు పెద్దగా స్పందించలేదు. అయితే.. టీఆర్ఎస్ నేతల మాటలు ఎక్కువవడంతో మంత్రి కొడాలి నాని స్పందించారు. వైఎస్ రాక్షసుడు కాదు.. రక్షకుడు అని అన్నారు. దీంతో.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి రియాక్ట్ అయ్యారు. మంత్రి నానికి హైదరాబాద్ లో రెండిళ్లు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ‘కనీసం ఆలోచించి మాట్లాడాలి కదా?’ అన్నారు. సి. రామచంద్రయ్యను ఉద్దేశిస్తూ.. ‘ఇక్కడ తింటూ.. అక్కడి మాట మాట్లాడితే ఎలా? తెలంగాణ ప్రజలు మీ గురించి ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? అంటూ వ్యాఖ్యానించడం సంచలనం రేపాయి.
Read More: YSR: వైఎస్ పై తెలంగాణ నేతల విసుర్లు..! రాజకీయమే కారణమా ..?
ఉద్యమం సమయంలో కేటీఆర్ ను ఓ వ్యక్తి ప్రత్యేక తెలంగాణ కోరుతున్న మీరు గుంటూరులో ఎందుకు చదువుకున్నారు? అని ఓ లైవ్ షోలో ప్రశ్నిస్తే.. ‘దేశంలో ఎక్కడైనా చదువుకునే హక్కు.. నివశించే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది. మీకేమైనా ఇబ్బందా?’ అని ప్రశ్నించారు. మరి.. ఇదే రాజ్యాంగం కొడాలి నానికి రాజ్యాంగం కల్పించదా? దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు.. ఆస్తులు ఉండొచ్చు. మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ కు ఈ విషయం తెలియనిది కాకపోయినా.. బెదిరింపు ధోరణిలో ఇలా హెచ్చరికలు చేస్తూ మాట్లాడటం తగనిది. మీ ఆస్తులు ఇక్కడున్నాయ్ కాబట్టి.. మేము ఏమన్నా మీరు పడాలి కానీ.. కౌంటర్ ఇవ్వకూడదన్నట్టు ఉంది పరిస్థితి.