TS Minister Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మీకు ఏమీ పని లేదా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ సీరియస్ గా స్పందించారు. కేంద్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నేతగా మాట్లాడారని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల పక్షాన రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళితే అవమానించేలా వ్యాఖ్యలు చేయడం రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేననీ, ఇది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. తక్షణం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
TS Minister Harish Rao: పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి
రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందానికి సమయం లేదని చెప్పిన కేంద్ర మంత్రికి తెలంగాణ బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తేనే వారి ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. తమ ప్రాధాన్యత రైతుల సంక్షేమం అయితే వారి ప్రాధాన్యత రాజకీయమని విమర్శించారు. బీజేపీకి రైతుల ఓట్లు కావాలి కానీ వారు పండించిన వడ్లు అవసరం లేదని అన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు అంశం కేంద్ర పరిధిలోనిది. వాళ్ల బాధ్యత వారు నెరవేర్చాలన్నారు రాష్ట్ర పరిధిలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతు బంధు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పూర్తిగా అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు వడ్లు ఇస్తామనీ, గోడౌన్ల సామర్థ్యం పెంచాలని పది సార్లు లేఖలు రాస్తే లేఖలు రాయలేదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు.