హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి బస్సులన్ని డిపోలకే పరిమితం కానున్నాయి. 50 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనబోతున్నట్టు ఆర్టీసీ జేఏసీ కమిటీ సభ్యులు వెల్లడించారు. మూడు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పటికీ ఆ ప్రయత్నాలన్ని విఫలం అయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధం అయ్యారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పట్టువీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడ్డ విషయాన్ని మర్చిపోకూడదన్నారు. గతంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదన్నారు. ఆర్టీసీని బతికించడానికే తమ పోరాటం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కు తగ్గేది లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని.. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఇప్పటికే నిలిచిపోయాయి. కార్మికులు పట్టువీడకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. దసరా సెలవులు కావడంతో ఇప్పటికే ప్రయాణాల కోసం టికెట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె.. కొత్త కష్టాల్లో పడేస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచే నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సమ్మెను సాకుగా చూపించి ప్రైవేట్ ట్రావెల్స్ అందింనకాడికి దోచుకుంటున్నాయి. టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి.
అయితే, ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో పండగ సీజన్లో బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సమ్మె సమయంలో ప్రైవేట్ డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లతో బస్సులను నడపనుంది. డ్రైవర్లకు రోజుకు రూ.1500, కండక్టర్లకు రూ. వెయ్యి చెల్లిస్తామని ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి అన్ని డిపోలలో సర్క్యులర్ జారీ చేసింది.