(ఫైల్ఫోటో)
అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియామకం అయిన పాలకమండళ్లు వివాద్సదంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలకమండలి ముందు వివాదంలో చిక్కుకుంది. ఆ పాలక మండలి మంగళవారం సమావేశం కానుండగా వైసిపి తీవ్రంగా అభ్యంతరపెడుతోంది.
రాష్ట్రంలో అధికారం చేతులు మారినపుడు రాజకీయ నియామకాల ద్వారా పదవులు నిర్వహిస్తున్నవారు తప్పుకోవడం రివాజు. పుట్టా సుధాకర్ యాదవ్ ఛైర్మన్గా చంద్రబాబు నియమించిన పాలకమండలి ఇంత వరకూ రాజీనామా చేయలేదు సరికదా, మంగళవారం సమావేశం కావాలని నిర్ణయించింది. దానితో వైసిపి వర్గాలు మండిపడుతున్నాయి.
ప్రతి మూడు నెలలకు ఒక సారి సమావేశం కావాల్సిఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఎన్నికల కోడ్ కారణంగా సమావేశం కాలేదు.
కోడ్ ముగిసిన మీదట ఛైర్మన్ సమావేశం ఏర్పాటు చేయడంపై వైసిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసిపి అదికారంలోకి వచ్చినా ఇంకా వారు పాలకమండలిలో కొనసాగడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ఈ విషయంపై వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆలయ కార్యనిర్వహణ అధికారికి పిర్యాదు చేయడానికి సిద్దపడ్డారు. దీంతో టిటిడి పాలకమండలి సమావేశం వివాదాస్పదంగా మారుతోంది. మంగళవారం పాలకమండలి సమావేశం జరుగుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది.
మరోపక్క విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలకమండలి చైర్మన్ గౌరంగ బాబుతో సహా తొమ్మిది మంది రాజీనామా చేశారు. మొత్తం 15మంది సభ్యులతో ఉన్న కమిటీలో మరో ఐదుగురు రాజీనామా చేయలేదు. ఈ పాలకవర్గ పదవీ కాలం జూన్ 30వ తేదీ వరకూ ఉండటంతో వీరు రాజీనామా చేయలేదు. చైర్మన్తో సహా తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేయడంతో ఆలయ కార్యనిర్వహణ అధికారిణి కోటేశ్వరమ్మ చైర్మన్, పాలకమండలి కార్యాలయాలకు తాళం వేశారు. కొందరు రాజీనామా చేయడం, మరి కొందరు రాజీనామా చేసేందుకు వెనుకాడుతుండటం వివాదాస్పదంగా మారింది.