తిరుమల: వివాదాల నడుమ అధికారులు వాకౌట్ చేయడంతో టిటిడి పాలకవర్గ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ టిడిపి ప్రభుత్వ హయాంలో నియమితులైన టిటిడి పాలకమండలి సమావేశం నిర్వహించడంపై వైసిపి నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో నేటి సమావేశాన్ని వైసిపి నేతలు అడ్డుకుంటారని భావించి సమావేశ మందిరమైన అన్నమయ్య భవనం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమావేశానికి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులు సుధా నారాయణమూర్తి, శ్రీకృష్ణ, మేడా రామకృష్ణారెడ్డి, చల్లా బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాకు తెలిపారు. సమావేశం ప్రారంభమైన కొద్ది సేపటికే టిటిడి కార్వనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, జెఇవో శ్రీనివాసరాజులు వాకౌట్ చేసి బయటకు వచ్చారు. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదిన పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నేటికి వాయిదా వేసినట్లు అధికారులు తెలియజేశారన్నారు. నేటి సమావేశానికి సంబంధించిన ఎజెండాపై చర్చించి తీర్మానాలు చేయాలని భావించామనీ, అధికారులు ప్రార్థన అనంతరం వాకౌట్ చేసి వెళ్లిపోవడం వల్ల సమావేశాన్ని వాయిదా వేశామనీ తెలిపారు. ‘ప్రభుత్వం మా పాలకవర్గాన్ని నియమించింది. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశాం. కొత్త ప్రభుత్వం తప్పుకోమని ఉత్తర్వులు ఇస్తే తప్పుకుంటాం. రాజీనామా చేయడానికి మాకు సెంటిమెంట్ అడ్డువస్తోంది‘ అని సుధాకర్ యాదవ్ అన్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యులు పార్థసారధి, రాయపాటి సాంబశివరావు, బొండా ఉమా, చల్లా బాబులు రాజీనామా చేశారు.