(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండు ప్రధాన సమస్యలపై మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా 23.78 కోట్ల రూపాయల జిఎస్టీ రద్దుతో పాటు టీటీడీలో రద్దు అయిన పాత నోట్లు డిపాజిట్ చేసుకునే అవకాశంపై వినతి పత్రాన్ని సమర్పించారు.
తిరుమల ఆలయ భద్రత కోసం నియమించుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పిఎఫ్) విభాగానికి 2014 ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి జూన్ 30, 2020 వరకూ బకాయి ఉన్న రూ.23,78 కోట్ల జిఎస్టీ రద్దు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను వైవి సుబ్బారెడ్డి కోరారు. జీఎస్టీ రద్దు చేయడం వల్ల టీటీడీకి మరింత ఆర్థిక బలం లభిస్తుందనీ, తద్వారా అనేక సామాజిక విద్యా, ధార్మిక కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహించే అవకాశం కలుగుతుందని సుబ్బారెడ్డి విన్నవించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500లు, రూ.1000లు రద్దు చేసిన తరువాత హూండీ కానుకల ద్వారా 1.8 లక్షలు వెయ్యి రూపాయల నోట్లు, 6.34 లక్షలు 500 నోట్లు వచ్చాయనీ, వీటిని రిజర్వు బ్యాంకులో గానీ, ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి నిర్మల సీతారామన్ను వైవీ సుబ్బారెడ్డి కోరారు.
పాత నోట్లు మార్పిడి అంశంపై టీడీడీ 2017 నుండి అనేక మార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసినా సానుకూల స్పందన లబించలేదని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విన్నవించిన ఈ రెండు ప్రధాన సమస్యలపై కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటో వేచి చూడాలి.