అమరావతి: తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటి విలువ కోటి 50 లక్షల రూపాయలుగా టీటీడీ గుర్తించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా పారదర్శకంగా ఈ వేలం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 30న కసరత్తు మొదలుపెట్టింది. ఇందు కోసం గతంలోనే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేశారు. నిరర్థకమైన ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 100 కోట్లు సమకూర్చుకోవాలని టీటీడీ భావించింది. 2020-21 వార్షిక బడ్జెట్ సందర్భంగా ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వివిధ రాజకీయ పార్టీలు తప్పుపడుతున్నాయి. టీడీపీ, బిజెపి, సీపీఐ, కాంగ్రెసు పార్టీల నేతలు టీటీడీ బోర్డు నిర్ణయం పై మండిపడుతున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీటీడీ నిర్ణయం సరికాదన్నారు. తిరుమల శ్రీవారికి భక్తులు ఇచ్చిన ఆస్తులను నిర్వహించడానికి మాత్రమే ప్రభుత్వానికి హక్కు ఉందని, దాన్ని విక్రయించే హక్కు లేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొంటున్నారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది? వెంకన్నకి భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారు? దీని వెనుక హిందుత్వాన్ని అణగదొక్కే కుట్ర దాగి ఉందనే అనుమానం ఉంది. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుంది’ అని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో టీటీడీ బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పలు టివి ఛానళ్ళలో ఈ విషయానికి సంబంధించి అవాస్తవాలు ప్రచారం చేయడంతో భక్తుల్లో గందరగోళం ఏర్పడిందని అన్నారు. జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), (09 – 04 – 1990) రూల్ -165, చాప్టర్ – 22, ద్వారా టీటీడీకి మేలు కలిగే అవకాశం ఉంటే దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు.
దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 నుంచి జరుగుతున్నదేననీ, ఈ రకంగా 2014 వరకు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారనీ తెలిపారు. ఇదే క్రమంలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షులుగా ఉన్న పాలకమండలి 2015 జూలై 28 న టీటీడీకి ఏరకంగాను ఉపయోగపడని ఆస్తులను గుర్తించి బహిరంగ వేలం ద్వారా వాటిని విక్రయించడానికి గల అవకాశాలను పరిశీలించడానికి ఒక సబ్ కమిటీని నియమించిదని సుబ్బారెడ్డి తెలిపారు. ఆ సబ్ కమిటీ నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో గుర్తించిన 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చదలవాడ కృష్ణమూర్తి ఆధ్యక్షతన పాలక మండలి ఆమోదం తెలిపిందని అన్నారు. ఆ తీర్మానం మేరకు 50 నిరర్థక ఆస్తుల విలువను రూ. 23.92 కోట్లుగా ధర నిర్ణయిస్తూ గత పాలక మండలి నిర్ణయాలను అమలు చేయడానికి ఆమోదం తెలపామని చెప్పారు. ఈ ఆస్తులు దేవస్థానానికి ఏవిధంగానూ ఉపయోగపడేవి కాదనీ, సదరు నిరర్థక ఆస్తులు 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయనీ తెలిపారు. వీటి వలన దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉన్నందు వల్ల ఈ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సుబ్బారెడ్డి చెప్పారు.
అయితే కొన్ని ప్రసార సాధనాలు టీటీడీ ఆస్తుల వేలంకి సంబంధించి గత పాలక మండలి తీసుకున్న , పై కమిటీలు తీసుకున్న నిర్ణయాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి లింకు పెట్టడం సరికాదని వైవీ అన్నారు. అవాస్తవ సమాచారం తో కథనాలు ప్రసారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సరి కాదని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి హితవు పలికారు.