తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేతృత్వంలో వేద విద్యావ్యాప్తి, పరిరక్షణ కోసం 2006లో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2007లో యూజీసీ దీన్నిరాష్ట్ర విశ్వ విద్యాలయంగా గుర్తించింది. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుండి పిజీ వరకూ అనేక కోర్సులను నడుపుతోంది. సనాతన సంప్రదాయమైన వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాలలను నడపడంతో పాటు దేశ వ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తున్నది. వేదం చదివిన వారిని ఆదుకునేందుకు ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్ అగ్నిహోత్రం ఆర్థిక పథకాలను టీటీడీ అమలు చేస్తున్నది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయాల హోదా ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ ఫోఖ్రియాల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రి రమేష్ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వ విద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందించారు. ఎస్వీ విశ్వ విద్యాలయానికి జాతీయ హోదా ప్రకటిస్తే దేశంలో తొలి వేద విశ్వ విద్యాలయంగా గుర్తింపు పొంది దేశ వ్యాప్తంగా వేద విద్యా వ్యాప్తికి తోడ్పాటు కలుగుతుందన్నారు వైవీ.
అదే విధంగా 14 సంవత్సరాలుగా ఎస్వీ విశ్వ విద్యాలయానికి యూజీసి 2 ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12 బీ కెటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ఏపి ప్రభుత్వం టీటీడీ ద్వారా వేద విద్య ఉన్నతికి కట్టుబడి ఉందని వైవీ మంత్రికి విన్నవించారు. అదే విధంగా ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర కాలేజీలో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని వైవీ సుబ్బారెడ్డి మంత్రికి మరో వినతి పత్రాన్ని అందించారు. 2016 ముందు వరకూ అమలు అయిన ఈ కోటాను ఆ తరువాత ఢిల్లీ యూనివర్శిటీ అనుమతించడం లేదని అన్నారు. 1961లో ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేసిన ఈ కళాశాలకు ఢిల్లీలో ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్దిదిద్దిందని గుర్తు చేశారు వైవీ సుబ్బారెడ్డి.