TTD: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. తమకు జీతాలు పెంచాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తుండగా ఆందోళన నిలిపివేయాలని అలిపిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా వీరు తమ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో 107 మంది పై కేసులు నమోదు చేశారు.
TTD: ఈవో జవహర్ రెడ్డి పై కార్మికుల సంచలన వ్యాఖ్యలు
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి గురువారం కార్మికులను చర్చలకు పిలిచారు. అయితే కార్మికులతో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆ సమావేశం అనంతరం కార్మికులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల పేరుతో తమను పిలిచి బెదిరింపులకు దిగారని కార్మికులు ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో లోపాలు, సమస్యలను పరిష్కరించకుండా తమ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నిన్న ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తీసుకువెళ్లారు. వీరి ఆందోళనకు మద్దుతుగా నిలుస్తున్న సీఐటీయు నాయకులను గృహ నిర్బంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై జనసేన స్పందించింది. వీరి ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వారి సమస్యలపై టీటీడీ సానుకూలంగా స్పందించకపోతే జనసేన కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలుస్తుందని పేర్కొంది.
కాగా జూన్ నెలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాళ్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేసే విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కానీ ఇంత వరకూ తదనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో వీళ్లు ఆందోళన బాట పట్టారు.