తిరుపతి: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టిటిడికి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామని అన్నారు.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ 2000 ఏప్రిల్ 1న ప్రారంభమైందని సింఘాల్ తెలిపారు. టిటిడికి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని ఆయన వెల్లడించారు. ఎస్బిఐలో 5387 కిలోల బంగారం ఉందని చెప్పారు. పిఎన్బిలో 1381 కిలోల బంగారం ఉందన్నారు.
ఏప్రిల్ 18, 2016లో పిఎన్బిలో 1381 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు సింఘాల్ తెలిపారు. ఏప్రిల్ 18, 2019 నాటికి అది మెచ్యూరిటీ అయ్యిందన్నారు. మెచ్యూరిటీ అంశంపై మార్చి 27నే పిఎన్బికి లేఖ రాశామన్నారు. బంగారం తరలింపు బాధ్యత పూర్తిగా పిఎన్బిదేనని సింఘాల్ అన్నారు. పిఎన్బివారు వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టిటిడి బంగారం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల కమిషన్ సీజ్ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పిఎన్బి చెప్పిందని సింఘాల్ తెలిపారు. ఎన్నికల కమిషన్ అధికారులకు డాక్యుమెంట్లు చూపినట్లు తమకు పిఎన్బి అధికారులు ఫోన్లో చెప్పారన్నారు. వాళ్లు ఎన్నికల కమిషన్ కు ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో తమకు తెలియదన్నారు.
తాము మార్చి 27న లేఖ రాసేటప్పుడు ఏప్రిల్ 18న రావాలని చెప్పామనీ,కానీ వాళ్ళు ఏప్రిల్ 18కి బదులు ఏప్రిల్ 20న బంగారం అందజేశారని సింఘాల్ చెప్పారు. బంగారాన్ని వాళ్లు ఎలా తరలిస్తారో,ఏ వాహనంలో తీసుకొస్తారో ఎలా తెలుస్తుందని సింఘాల్ ప్రశ్నించారు. బంగారం టిటిడికి చేరిందలేదా అన్నదే ముఖ్యంగానీ మిగిలిన విషయాలు తమకు అవసరం లేదన్నారు. కేజీ బంగారం డిపాజిట్ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామని సింఘాల్ స్పష్టం చేశారు. టిటిడికి ఏ విధంగా ఆదాయం వస్తుందో ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవటమే బోర్డు పని అని సింఘాల్ పేర్కొన్నారు.
ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా పట్టుబడ్డ బంగారంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తిరపతికి ఈ బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని టిటిడికి అప్పగించారు.