లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించి అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. నిబంధనలు పాటిస్తూ తగిన స్థాయిలో సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు.
అయితే ఇదే క్రమంలో కొంతమంది టిటిడి సిబ్బంది కరోనా బారినపడటం ఇప్పుడు అందరిని కంగారు పెడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటివరకు 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా బుధవారం మీడియాకు తెలిపారు.
నిత్యం 200 మంది టిటిడి సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారని అందులో 80 మంది వరకు పాజిటివ్ వచ్చింది అని చెప్పిన భరత్ గుప్తా భక్తుల ద్వారా ఉద్యోగులకు కరోనా సోకినట్లు ఆధారాలు లేవని అన్నారు. దాదాపు 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చిందని చెప్పారు.