వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీడీలో ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. చిన్నవి కూడా చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. నిజానికి టిటిడిలో వివాదాలు ఏమి కొత్త కాదు. నాడు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వివాదాలు జరిగేవి, కానీ అంతగా బయటకు వచ్చేవి కాదు. కానీ నేడు ప్రతిపక్ష మీడియా పెద్ద కన్ను, పెద్ద పెన్ను వేసుకుని కాపలా కస్తూ ఉండడంతో వైసిపి హయాంలో వివాదాలు బాగా పెద్దవిగా బయటపడుతున్నాయి. తాజాగా అక్కడ ఏం జరిగిందంటే…!
ఓ ఉద్యోగి సస్పెన్షన్..!
ఆస్తుల వేలం విషయంలో టీటీడీ బోర్డులు, వైసిపి ప్రభుత్వం అభాశుభాలు పాలు అయిన సంగతి తెలిసిందే. చివరికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు కదా. తాజాగా ఏం చేశారంటే… టీటీడీ పెద్దలకు అసలు “ఆస్తుల వేలం” అనే సమాచారం, అంతర్గత అంశం ఎలా బయటకు వెళ్ళింది..? అనే అనుమానాలు కలిగాయి. అందుకే ఒక బాధ్యుడిని గుర్తించి సస్పెండ్ చేసి పడేసారు. ఆస్తుల వేలం సమాచారాన్ని లీక్ చేశారంటూ టీటీడీ ఎస్టేట్ అధికారి దేవేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుమల వెంకన్నకు చెందిన నిరర్థక ఆస్తులను వేలం వేసేందుకు టీటీడీ సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే వేలానికి సంబంధించిన సమాచారాన్ని దేవేందర్ రెడ్డి లీక్ చేశారని టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు. నివేదిక ఆధారంగా దేవేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ స్థిరాస్తులను ఎస్టేట్ విభాగం పర్యవేక్షిస్తుంటుంది. డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ కలిగిన దేవేందర్ రెడ్డి ఎస్టేట్ అధికారిగా ఉన్నారు. ఆయన వల్లే ఆస్తుల వేలం సమాచారం లీక్ అయిందని అధికారులు గుర్తించారు.
ఇక్కడితో ఆగినట్టేనా…!!
ఆస్తుల వేలంలో అసలే పరువు దక్కించుకున్న టీటీడీ ఇప్పుడు ఈ అధికారి సస్పెండ్ వ్యవహారంతో మరో వివాదంలో చిక్కుకుందేమో. సదరు అధికారి సైలెంట్ గా ఉంటే ఓకే.. లేదా పాత, కొత్తగా అన్ని కలిపి కోర్టులకు వెళ్తే వ్యవహారం ముదరడం ఖాయమని చెప్తున్నారు. అసలే ఈ మధ్య ఉద్యోగుల వెంట రాజకీయాలు విపరీతంగా నడుస్తున్నాయి. అందుకే ఇది కూడా రాజకీయ రంగు పులుముకుంటే పెద్ద వివాదంగానే మారుతోంది.