సాధారణ భక్తులకు ఊరట కల్గించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వీవీఐపీ, వీఐపీలు వేకువ జామున శ్రీవారి దర్శనానికి అవకాశం లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయాన్ని తీసుకుంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుండి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
ప్రతి రోజు వేకువ జాము 5 గంటలకు మొదలయ్యే వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభమవుతుందని చైర్మన్ తెలిపారు. రాత్రి నుండి సర్వదర్శనంలో క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల మార్పు అంశంపై పరిశీలన చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం ఇఓ ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు. వీఐపీ బ్రెక్ దర్శనాలను ఉదయం 5 గంటల నుండే ప్రారంభిస్తుండటంతో రాత్రి వేళ సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారన్నారు. రాత్రి వేచి ఉన్న భక్తులు ఉదయం 8.30 గంటల లోపు దర్శనం అయ్యేలా చూస్తామని అన్నారు.
కళ్యాణోత్సవం టికెట్లు తీసుకున్న వారికి ఇబ్బంది లేకుండా ఈ చర్యలు చేపట్టామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నవంబర్ 1 నుండి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో టీటీడీ ఉద్యోగాలకు సంబందించిన కీలక నిర్ణయాలను తెలిపారు వైవీ. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పిన ఆయన.. తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లపై రాయితీలు ఇస్తామని చెప్పారు.
కాగా సర్వదర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ ఇఓ ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబర్ 1 నుండి ఈ టోకెన్ల జారీ ఉంటుందని చెప్పారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు. సోమ, బుధ, శని, ఆదివారాల్లో 20వేల నుండి 25వేల టోకెన్లు జారీ చేస్తామనీ, మంగళ, గురు, శుక్ర వారాల్లో 15 వేల చొప్పున టోకెన్లు జారీ చేస్తామని ఇఓ ధర్మారెడ్డి తెలిపారు.
YS Jagan: ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్